కాంగ్రెస్‌ తొలి జాబితా రెడీ

Telangana Elections 2018 Congress Party Candidates First List Is Ready - Sakshi

74 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితాకు అధిష్టానం ఆమోదముద్ర పడింది. 74 మంది అభ్యర్థులతో కూడిన తమ మొదటి జాబితాను మిత్రపక్షాల జాబితాలతో కలిపి శనివారం ఉదయం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ విడుదల చేయనుంది. మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలైన టీడీపీకి 14 స్థానా లు, తెలంగాణ జనసమితికి 8, సీపీఐకి 3, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం కేటాయించగా.. మిగిలిన 93 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. 94 స్థానాలకూ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థులను ప్రతిపాదించగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) 74 స్థానాలకు ఆమోదం తెలిపింది. మంగళ, బుధవారాల్లో పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేసి ఒక్కో నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు చొప్పున పేర్లను ప్రతిపాదించి సీఈసీకి పంపింది. సీఈసీ ఇదివరకే 57 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా గురువారం 17 స్థానాల్లో అభ్యర్థులను ఎంపి క చేసింది.

గురువారం సాయంత్రం సోనియాగాంధీ నివాసంలో సీఈసీ సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యు లు ఏకే ఆంటోనీ, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, అహ్మద్‌ పటే ల్, వీరప్ప మొయిలీ, అంబికాసోనీ, అశోక్‌ గెహ్లాట్‌లతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డి, స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు భక్తచరణ్‌దాస్, షర్మిష్టా ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్‌ ఇందులో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కుంతియా, బోసురాజు మీడియాతో మాట్లా డారు. ‘‘పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ 74 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.  మిగిలిన సీట్లపై సీఈసీ ఈనెల 11 లేదా 12న నిర్ణయం తీసుకుంటుంది. తొలి జాబితా ఈ నెల 10న హైదరాబాద్‌లో కూటమి పార్టీలతో కలిసి జాబితా విడుదల చేస్తాం’’అని తెలిపారు.

తెలంగాణ ఇంటి పార్టీకి ఎక్కడ? 
తెలంగాణ ఇంటి పార్టీ నకిరేకల్, మునుగోడు, మహబూబ్‌నగర్‌ స్థానాలను కోరుతోంది. నకిరెకల్‌ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం అయినందున ఇక్కడి నుంచి చెరుకు సుధాకర్‌ భార్య చెరుకు లక్ష్మి పోటీ చేయనున్నారు. చెరుకు సుధాకర్‌గౌడ్‌ మునుగోడు(జనరల్‌) ఆశిస్తున్నారు. కానీ ఆ స్థానాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరుతున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి ఎన్నం శ్రీని వాస్‌రెడ్డి తెలంగాణ ఇంటి పార్టీ నుంచి టికెట్‌ ఆశించినప్పటికీ, ఆ స్థానంలో కాంగ్రెస్‌ లేదా టీడీపీ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.

వివాదాస్పద సీట్లు పెండింగ్‌లో
భక్తచరణ్‌ దాస్‌ నేతృత్వంలోని తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ 94 స్థానాలకూ అభ్యర్థులను ప్రతిపాదించినప్పటికీ సీఈసీ 74 స్థానాల్లోనే అభ్యర్థుల ఎంపికను ఆమోదించింది. మిగిలిన 20 సీట్లను (ఇందులో తెలంగాణ ఇంటి పార్టీకి 1 వెళు తుంది) పెండింగ్‌లో పెట్టింది. వీటిలో కొన్ని స్థానాలను సీపీఐ, మరికొన్ని స్థానాలను టీజేఎస్‌ ఆశి స్తుండడం.. ఒక్కోస్థానం నుంచి పోటీ తీవ్రంగా ఉండటం కారణంగా ఆయా స్థానాలను రెండో విడతలో వెలువరించనున్నారు. ఇప్పుడే ఆయా స్థానా లను ప్రకటిస్తే అక్కడ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంటుందని, టీఆర్‌ఎస్, బీజేపీ వంటి పార్టీలకు వలస వెళ్లే ప్రమాదం ఉందన్న వ్యూహంతో వీటిని పెండింగ్‌లో పెట్టినట్టు తెలు స్తోంది. మునుగోడు, పటాన్‌చెరువు, మంచిర్యాల, సూర్యాపేట, ఇల్లందు, రాజేంద్రనగర్, నకిరేకల్, నాగర్‌కర్నూల్, తుంగతుర్తి, మహబూబ్‌నగర్, దేవరకొండ, కంటోన్మెంట్, వరంగల్‌ ఈస్ట్, ఎల్‌.బి.నగర్, బోథ్, ఆదిలాబాద్, ఎల్లారెడ్డి, నారాయణఖేడ్‌తోపాటు మరో రెండు కీలక స్థానాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్టు సమాచారం. 

రేవంత్‌ వర్సెస్‌ ఉత్తమ్‌ 
అభ్యర్థుల ఖరారు విషయంలో టీపీసీసీ ముఖ్య నేతల మధ్య పొరపొచ్చాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి 24 స్థానాలకు అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి ఇచ్చారని, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మా త్రం ఆ జాబితాను అసలు పరిగణనలోకే తీసుకోవద్దని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top