‘అతను పప్పు కాదు’

Tejashwi Yadav Proves He is No Pappu - Sakshi

పట్నా:  బిహార్‌లో లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం వెనుక కనిపించని శక్తి  తేజస్వీ యాదవ్‌పై ప్రశంసలుకురుస్తున్నాయి. తండ్రి లాలూ ప్రసాద్‌ జైలుకెళ్లిన  తరువాత ఎదుర్కొన్న మొదటి ఎన్నికల్లోనే ఆర్జేడీ ఘనవిజయం సాధించిన దరిమిలా.. ‘మా నాయకుడు పప్పు కాదు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని నడిపించగల సమర్థుడు’అంటూ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అరారీయా , జహనాబాద్‌ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే.

అరారియా లోక్‌సభ స్థానంలో బీజేపీ ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్‌పై 61 వేల పైచిలుకు ఓట్ల భారీ ఆధిక్యంతో ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలం గెలుపొందారు. సర్ఫరాజ్‌కు 5,09,334 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్‌కు 4,47,346 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ ఎంపీ మహమ్మద్ తస్లిముద్దీన్ మృతితో ఈ అరారియాకకు ఉప ఎన్నిక జరుగగా.. తస్లిముద్దీన్ తనయుడు అలాంను ఆర్జేడీ బరిలోకి దింపింది. తండ్రి తర్వాత ఆయన తనయుడే అరారియాలో (ఆర్జేడీ) ఘనవిజయం సాధించింది.

ఇక జహనాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని కూడా ఆర్జేడీ గెలుచుకుంది. ఆర్జేడీ అభ్యర్థి కృష్ణమోహన్ యాదవ్‌ ఇక్కడ విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి, జేడీయూకు చెందిన అభిరామ్ శర్మపై 35,000 ఓట్ల మెజార్టీతో కృష్ణమోహన్ గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లో ఆర్జేడీ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు తేజస్వీపై ప్రశంసలు కురిపిస్తూ ప్రకటనలు చేస్తున్నారు.మహాకూటమి నుంచి జేడీయూ వైదొలిగిన తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నిక ఆ పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్‌కు పరీక్షగా నిలిచాయన్న సంగతి విదితమే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top