
సాక్షి, చెన్నై: తమిళనాడులో రాజకీయంగా ఎదగాలని భావించేవారికి సినిమా రంగం రాచబాట. వెండితెర వేలుపులుగా ఉన్నవారు రాజకీయ వేదికలపై మెరిసిపోయే అవకాశాన్ని అలవోకగా అందుకోవచ్చు. తమిళనాడు అలనాటి ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత ఇలా అందరూ కోలీవుడ్తో బలమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నవారే. తమిళనాడులోని ప్రముఖ హీరోల తుది టార్గెట్ సీఎం కుర్చీనే అంటే అతిశయోక్తికాదు.
అయితే ఇప్పటివరకు సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్లు పరోక్షంగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఇక సూపర్స్టార్ త్వరలోనే రాజకీయాల్లో రానున్నారని తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి 31 వరకు ఆరు రోజుల పాటు అభిమానులతో రజనీ మరోసారి భేటీ కానున్నారు. భేటీ అనంతరం డిసెంబర్ 31న లేదా జనవరి 1నో కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో అభిమానులతో సమావేశమైన సందర్భంలో రజనీ రాజకీయల్లోకి వస్తున్నారంటూ భారీగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.