‘రాఫెల్‌పై కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించడం లేదు’ | Rahul Gandhi Speech In Sangareddy Public Meeting | Sakshi
Sakshi News home page

‘రాఫెల్‌పై కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించడం లేదు’

Apr 1 2019 3:24 PM | Updated on Apr 1 2019 3:34 PM

Rahul Gandhi Speech In Sangareddy Public Meeting - Sakshi

సాక్షి, సంగారెడ్డి : ఎన్నికలకు ముందు డ్రామాలో భాగంగానే కేసీఆర్‌ మోదీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, రాఫెల్‌పై కేసీఆర్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిలదీశారు. సంగారెడ్డిలో సోమవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్‌ మోదీని సపోర్ట్‌ చేస్తాడని, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని సమర్థించాడని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పేదరికాన్ని అంతం చేయాలనకుంటే.. మోదీ పేదలనే అంతం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. కనీస ఆదాయానికి దిగువనున్న 5కోట్ల కుటుంబాలకు ఏడాది 3.60లక్షల సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. మోదీ ఉదయం లేచింది మొదలు 15మంది ధనవంతుల సహాయం కోసమే పనిచేస్తారని ఆరోపించారు. మోదీ పేదలపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తే.. కాంగ్రెస్‌ పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తుందని తెలిపారు.

చైనాలో రోజుకు 50వేల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుంటే.. దేశంలో మాత్రం 27వేల ఉద్యోగాలు కోల్పోతున్నారని వివరించారు. పెద్దనోట్ల రద్దును ఏ ఆర్థిక వేత్తను అడిగినా పిచ్చితనమని అంటారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే.. జీడీపీలో ఆరు శాతం నిధులు విద్యారంగంపై ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. హరిత, శ్వేత, టెలికాం విప్లవాలను తీసుకొస్తామన్నారు. పంట పొలాల వద్దే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుతో రైతుల మెరుగైన ధరలు వస్తాయన్నారు. మోదీ ధనికులు, పేదలు అంటూ రెండు రకాల భారతదేశాలను ఏర్పర్చాలనుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు అన్నప్పుడే.. మోదీ అబద్దం చెబుతున్నాడని, అది అసాధ్యమని తనకు తెలుసన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement