‘అబద్దం చెప్పి.. ఉత్తమ్‌ ఎంపీగా గెలిచారు’

Palla Rajeshwar Reddy Slams Uttam Kumar Reddy - Sakshi

సాక్షి, సూర్యాపేట : ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బ్లాక్‌మెల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరెడ్డి ఆరోపించారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతూ.. ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. శనివారం ఆయన నేరేడుచర్ల మండల కేంద్రంలో  ఏర్పాటు చేసిన బూత్‌కమిటీ ఇంచార్జీలా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. హుజూర్‌ నగర్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడగొట్టే శక్తి ఎవరికి లేదన్నారు. ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్‌ఎస్‌దేనని, 40వేల మెజార్టీతో హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తమ్‌ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, కేంద్ర మంత్రి అవుతానని ప్రజలను మభ్యపెట్టి ఉత్తమ్‌ ఎంపీగా గెలిచారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గానికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. నిజాయితీ, నిబద్దతతో పనిచేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ గెలుపుతో నియోజకవర్గ దశ మారుతుందని, అభివృద్ధికి ముఖద్వారంగా హుజూర్‌నగర్‌ను నిలుపుతామని పల్లా హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పల్లాతో పాటు ఎమ్మెల్యే భాస్కర్‌రావు, హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top