‘ఆయన చేరిక వెయ్యి ఏనుగుల బలం’
సాక్షి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లాలో గండ్ర సత్యనారాయణ రావు చేరికతో టీఆర్ఎస్కు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు రికార్డును సీఎం కేసీఆర్ తిరగరాస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయన రావు, మంథని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్లా జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నరసింగ రావులు బుధవారం టీఆర్ఎస్లో చేరారు.
మంత్రులు కేటీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఈటల రాజేందర్లు వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. చరిత్రలో కొన్ని మలుపులు అనివార్యంగా వస్తాయని, కాంగ్రెస్ పార్టీ ఆగడాలను అంతమొందించేందుకు ఎన్టీఆర్ టీడీపీ ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. తెలంగాణలో ఇక టీడీపీ కనుమరుగు అయినట్లేనని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ మోచేతి నీళ్లు తాగుతున్న కాంగ్రెస్కు ఇక్కడ పుట్టగతులు ఉండవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.