సత్తాలేనివారే ఇలా పరిపాలిస్తారు..
చెరుకు సుధాకర్, మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్ : శాంతియుతంగా నిరసన తెలిపే స్వేచ్ఛను కూడా రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆరోపించారు. ధర్నాచౌక్ ఎత్తేశారని, ర్యాలీలు నిర్వహించుకునేవారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్లల్లో పెడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ శుక్రవారం ఇక్కడ సుధాకర్ను కలిశారు. కొద్దిసేపు భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడారు.
‘ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం 23 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మంద కృష్ణ మాదిగను అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు. సీమాంధ్రులు కూడా చేయని పరిపాలనను కేసీఆర్ చేస్తున్నారు’ అని సుధాకర్ అన్నారు. సత్తా లేనివారే పోలీసులను అడ్డుపెట్టుకుని పాలిస్తుంటారని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతులను కేసీఆర్ నొక్కేస్తున్నారని మంద కృష్ణ మాదిగ విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తనను పదిరోజులు జైలులో పెట్టడం దారుణమన్నారు.
తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ నేరాలను తిరగదోడి ఆయనను జైలులో పెడ్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలనే డిమాండ్తో హైదరాబాద్ లో జనవరి ఒకటి నుండి ఐదో తేదీ వరకు తాను చేపట్టే నిరవధిక దీక్షకు స్థలం కేటాయించాలని డీజీపీని కలిసినట్లు మంద కృష్ణ తెలిపారు.