టీఆర్‌ఎస్‌ను జనం గద్దెదింపుతారు: లక్ష్మణ్‌ | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను జనం గద్దెదింపుతారు: లక్ష్మణ్‌

Published Mon, Jun 4 2018 1:38 AM

Laxman Comments on TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఇదే పంథాలో టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పలుకుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్‌ పాలన ఎలా ఉంటుందో చూసిన ప్రజలు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.

ఆదివారం ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశంలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి లక్ష్మణ్‌ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న అన్ని వర్గాల ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రతిష్టను పెంచుతున్న మోదీ విధానాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నా రు. కార్యక్రమంలో పార్టీ మీడియా సెల్‌ కన్వీనర్‌ సుధాకరశర్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement