
త్వరలోనే సమస్య సమసిపోతుంది : కుమారస్వామి
బెంగళూర్ : కర్ణాటకలో తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. సంకీర్ణ సర్కార్ ముందున్న సమస్యలు త్వరలో సమసిపోతాయని చెప్పారు. త్వరలోనే కేబినెట్ పునర్వ్యస్థీకరణ చేపడతామని తెలిపారు. కాగా కర్ణాటకలో సంక్షోభం ఎదుర్కొంటున్న జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ సమస్యలను అధిగమించేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలకు పదునుపెట్టింది.
కాంగ్రెస్ మంత్రులు ఇప్పటికే రాజీనామా చేయగా, జేడీఎస్ మంత్రులు సైతం రాజీనామా చేసి ఇరు పార్టీలకు రాజీనామా చేసిన రెబెల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఆఫర్ చేస్తామనే సంకేతాలు పంపారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం కుమారస్వామి ప్రకటించి రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి సంకీర్ణ శిబిరానికి చేరువయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్ చేయడం ద్వారా వారు బీజేపీకి దగ్గరకాకుండా నిలువరించాలని సంకీర్ణ సర్కార్ యోచిస్తోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్ 35 మంది పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించింది.