ఏ నేరం చేయకపోతే ఉలికిపాటు ఎందుకు? | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు పరోక్షంగా నేరాన్ని అంగీకరించారు’

Published Tue, Mar 5 2019 12:00 PM

KTR Questions Chandrababu Over It Grid Data Breach - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల డేటా కుంభకోణం ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవరపాటుకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే.  ఐటీ గ్రిడ్స్‌ స్కామ్‌లో తమ గుట్టు బయటపడుతుందనే భయంతో టీడీపీ నేతలు వింత వాదనలు దిగడమే కాకుండా.. కేసును అడ్డుకోవడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏపీ పోలీసులను సైతం టీడీపీ నేతలు తమ స్వార్ధానికి బలి చేసే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఈ కేసును పక్కదారి పట్టించేందుకు న్యాయస్థానాల్లో తప్పుడు పిటిషన్‌లను దాఖలు చేస్తున్నారు. తాజాగా ఈ పరిణామాలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడుకు సూటి ప్రశ్నలు వేశారు.(అడ్డంగా దొరకడం మిద్దెలెక్కి అరవడం) 

ఏ నేరం చేయకపోతే చంద్రబాబుకు ఈ ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించిన కేటీఆర్‌.. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసులు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని నిలదీశారు. కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. ఈ చర్యలను చూస్తుంటే కోట్లాది మంది ఏపీ ప్రజల డేటాను చంద్రబాబు ప్రైవేటు కంపెనీలకు అందజేసినట్టు పరోక్షంగా అంగీకరించినట్టు అయిందన్నారు. విచారణ జరిగితే దొంగతనం బయటపడుతుందనేది చంద్రబాబు భయమని కేటీఆర్‌ పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.

అంతకుముందు సోమవారం ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌ చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లకు తప్పుచేసి దొరికిపోవడం అలవాటేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ పౌరుడి ఫిర్యాదు మేరకే ఐటీ గ్రిడ్స్‌పై విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు సీఎంగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు.

Advertisement
Advertisement