కేశినేని నాని కినుక వెనుక..

సాక్షి, విజయవాడ: తెలుగు దేశం పార్టీలో లోక్సభ పదవుల పందేరం చిచ్చు రేపింది. పార్టీ ఇవ్వజూపిన పార్లమెంటరీ చీఫ్ విప్ పదవిని పార్లమెంటరీ విప్ పదవిని విజయవాడ ఎంపీ కేశినేని నాని తిరస్కరించారు. ఇటీవ ల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా పార్టీ పెద్ద తీరు మారకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గల్లా కుటుంబానికి పార్టీ పొలిట్బ్యూరో, పార్లమెంటరీ పదవులు కట్టబెట్టడంతో కేశినేని కినుక వహించినట్టుగా తెలుస్తోంది. తాను బీజేపీలో చేరతానని ప్రచారం జరుగుతున్న సమయంలో తనకు పార్లమెంటరీ విప్ ఇవ్వడం చూపడం పట్ల సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పటికైనా పార్టీలో పనిచేసింది ఎవరు, పెత్తనం చేసింది ఎవరనేది గుర్తించాలని కేశినేని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతగా గల్లా జయదేవ్ను నియమించిన సంగతి తెలిసిందే.
కాగా, కేశినేని నాని పార్టీ మారడం లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆయన బీజేపీలో చేరతారనడం అవాస్తవమని పేర్కొన్నారు. కేశినేని నాని పార్టీ మారుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయనతో జయదేవ్ సమావేశమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో సాయంత్రం తన నివాసానికి రావాలని కేశినేని నానికి టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. (చదవండి: టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్!)