కర్ణాటకలో ఉప ఎన్నికల నగారా

Karnataka bypolls to be held on Dec 5, counting on Dec 9 - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు అదే నెల 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో సంజీవ్‌ కుమార్‌ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సోమవారం నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 19న నామినేషన్ల పరిశీలన, 21 వరకు ఉపసంహరణ ఉంటుందని ఈసీ స్పష్టంచేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలతో సహా జిల్లాల్లో కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు.

ఈ నియమావళి పోటీ చేసే అభ్యర్థులతో పాటు, రాజకీయ పార్టీలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. గత జూలైలో సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామా చేసిన 17 మంది కాంగ్రెస్‌–జేడీఎస్‌ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ అనర్హత వేటు వేశారు. స్పీకర్‌ తీర్పును సవాల్‌ చేస్తూ అనర్హత ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈసీ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. రాజరాజేశ్వరినగర, మస్కి నియోజకవర్గాలపై కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ ఎన్నికలు జరపడం లేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top