రైతుల రుణాలను మాఫీ చేస్తాం, మంత్రి హరీశ్‌ | Telangana Farmer's Loan Waiving Money Will be Released in 2 Days, Says Harish Rao - Sakshi
Sakshi News home page

రైతుల రుణాలను మాఫీ చేస్తాం : మంత్రి హరీశ్‌

May 6 2020 4:17 PM | Updated on May 6 2020 5:22 PM

Harish Rao Says Farmers Loan Waiver money Will Be Released In Two Days - Sakshi

కాంగ్రెస్, బీజేపీలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయి.

సాక్షి, మెదక్‌ : రైతు రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రెండు రోజుల్లో రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తామని చెప్పారు. 25 వేల రూపాయలలోపు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేస్తామని, లక్ష రూపాయల రుణం ఉన్నవారికి నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామని చెప్పారు. 5 లక్షల 80 వేల‌మంది రైతులకు రూ.1198‌ కోట్లు బ్యాంకులో జమ చేయనున్నామన్నారు. బుధవారం ఆయన నిజాంపేట్ మండలం నార్లాపూర్ లో కొండపోచమ్మ సాగర్ కాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి హారీశ్‌ మీడియాతో మాట్లాడుతూ..జిల్లా‌లో కొత్తగా కరోనా కేసులు‌లేవని....రేపో మాపో గ్రీన్‌‌జోన్‌లోకి జిల్లా మారనుందని తెలిపారు.
(చదవండి : వైన్స్‌ షాపుల వద్ద ప్రత్యేక మార్క్‌లు )

కరోనా తగ్గినా జాగ్రత్తగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని... మాస్క్ లేకుండా బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. కరోనా ఉధృతిలోనూ రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటే.. కాంగ్రెస్, బీజేపీ మొసలి కన్నీరు కారుస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వడ్లకు క్వింటా రూ.1,835కు కొనుగోలు చేస్తోందని, అదే కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రూ.1,300కు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.1200కు కొనుగోలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement