
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): దళితులపై వివక్ష చూపుతున్న టీడీపీ నుంచి ఎస్సీలు బయటకు వచ్చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య పిలుపునిచ్చారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.
దివంగత ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో భారీ నీటిపారుదల, రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖలు దళితులకు కేటాయించారని, చంద్రబాబు మంత్రివర్గంలో మాత్రం ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిథ్యం కొరవడిందన్నారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులతో పాటు, రాజ్యసభ సీట్లను అగ్రవర్ణాలకే కేటాయించారని గుర్తు చేశారు. టీడీపీ పోలిట్బ్యూరో నుంచి ఎంపీ శివప్రసాద్ను సైతం తొలగించారన్నారు. కాపుల మెప్పు కోసం పీతల సుజాతను మంత్రివర్గం నుంచి తొలగించడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గిరిజన మండలిలో పార్టీ నాయకులను నామినేట్ చేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒత్తిడి తీసుకురావడం వల్లే గిరిజన సలహా మండలి నియమించారన్నారు.