ఏ రాష్ట్రం అయినా ఇలా చేసిందా?

CPI Leader Ramakrishna Fires on Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్ర రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం బ్లూప్రింట్‌ విడుదల చేయాలని సీపీఐ నాయకుడు రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోతే మళ్లీ 10.32శాతం వడ్డీకి బాండ్లు విడుదల చేసి మరింత అప్పులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రమైనా బాండ్లతో అప్పు ఈ విధంగా చేసిందా అని ప్రశ్నించారు.

కంపెనీల కోసం బాండ్లు విడుదల చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజననాటికి 94వేల కోట్ల అప్పు ఉండేది ఇప్పుడు లక్షల కోట్లకు చేరువైందని విమర్శించారు. రాజధాని నిర్మాణంపై వెంటనే అఖిలపక్షం నిర్వహించి చర్చించాలని డిమాండ్‌ చేశారు. రాజధాని నిర్మాణం, అమరావతి బాండ్ల వ్యవహారంపై అన్ని పార్టీలతో చర్చించి ఉద్యమిస్తామని పేర్కొన్నారు.

మోదీని అప్పుడే నిలదీయాలి
బీజేపీతో చేతులు కలిపి చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని రామకృష్ణ విమర్శించారు. చెంబుడు నీళ్లు, మట్టి తీసుకొచ్చినప్పుడే చంద్రబాబు నరేంద్రమోదీని నిలదీసేది ఉండేదన్నారు. స్వార్ధం కోసం అహో అన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రం మోసం చేసిందంటున్నారని విమర్శించారు.

పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది
చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందని రామకృష్ణ మండిపడ్డారు. ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. హోం మంత్రిని డమ్మీని చేశారని ఎద్దేవా చేశారు.

కార్పొరేట్‌ సంస్థల నిర్వాహకానికి వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపునిచ్చిన విద్యార్థి విభాగానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. అలాగే అగ్రిగోల్డ్‌ బాధితుల న్యాయంకోసం అక్టోబర్‌ 1న జిల్లా కలెక్టరేట్ల వద్ద చేపట్టనున్న మహాధర్నాకి మద్దతు ప్రకటిస్తున్నామని రామకృష్ణ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top