స్థానిక సంస్థల ఎన్నికలపై బొత్స కీలక ప్రకటన | Botsa Satyanarayana Speech On Local Body Elections Reservations | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : బొత్స

Mar 2 2020 7:10 PM | Updated on Mar 2 2020 7:28 PM

Botsa Satyanarayana Speech On Local Body Elections Reservations - Sakshi

సాక్షి, తాడేపల్లి : స్థానికల సంస్థల ఎన్నికల రిజర్వేష్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా 50 శాతం రిజర్వేషన్లకు లోబడే ఎన్నికకు వెళ్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగుల బలహీన వర్గాలు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావించిందని, కానీ టీడీపీ కుట్ర కారణంగానే ఈ అంశాని కోర్టు తొసిపుచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. అధిక శాతం ఉన్న బలహీన వర్గాలకు న్యాయం చేయలేకపోయాము అనే బాధ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మంత్రులకు ఉందన్నారు. 30 రోజుల్లో ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు, విద్యార్థుల పరీక్షలు వంటి కీలక అంశాలు ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్నాయని, వాటన్నింటినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల 50శాతానికి మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సోమవారం ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కుట్రతోనే వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్లు కోల్పోయారని మండిపడ్డారు. బలహీన వర్గాల ఎదుగుదలకు అడ్డుపడుతున్న చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని మంత్రి వెల్లడించారు. బీసీలకు చంద్రబాబు ఇచ్చే బహుమానం ఇదేనా అని నిలదీశారు. బలహీన వర్గాలు వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలవడం చూడలేక చంద్రబాబు వారికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

‘బీసీలు అంటే చంద్రబాబుకు చలకన భావన. ఓట్లు వేసేందుకు వారిని ఉపయోగించుకుంటారు. వెనుకబడిన వర్గాలు అంటే చంద్రబాబుకు ఎందుకు అంత కడుపు మంట. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని గతంలో అన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను బడుగు బలహీన మైనార్టీలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 59 శాతం రిజర్వేషన్లు ఉండాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు నాయుడే దగ్గరుండి టీడీపీ కార్యకర్తలతో కేసులు వేయిస్తున్నారు. ఆ పరిణామంతో టీడీపీలో ఉన్న బీసీ నేతలు సిగ్గుపడలి’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement