కేంద్రంపై టీఆర్‌ఎస్‌ కుట్ర పన్నుతోంది | Sakshi
Sakshi News home page

కేంద్రంపై టీఆర్‌ఎస్‌ కుట్ర పన్నుతోంది

Published Fri, Feb 8 2019 12:21 AM

Bjp leaders fire on trs and kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై కుట్రలు పన్నుతూ రాష్ట్ర రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’పథకం అర్హులైన రైతులకు కూడా వర్తించదని టీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలను రాష్ట్రంలో పక్కదారి పట్టిస్తోన్న ప్రయత్నాలను రాష్ట్ర బీజేపీ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తోం దన్నారు. అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో ఎన్నికల సన్నద్ధతపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం లక్ష్మణ్‌ ఇక్కడి మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తమ ప్రచార ప్రసార సాధనాల ద్వారా ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగానే తక్కువ చేసి చూపించేం దుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటివరకూ ఈ పథకంపై విధివిధానాలను కేంద్రం రూపొందించనేలేదని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన రైతులందరికీ ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ కార్యదర్శుల అభిప్రాయాలు తీసుకుంటున్నారని ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి వచ్చి ఇక్కడి అధికారులతో చర్చించారని తెలిపారు. అయితే ఈ పథకాన్ని తక్కువ చేసేలా కేంద్రం నిబంధనలను రూపొందిస్తుందన్నట్టు మీడియాలో కథనాలు రావడం ఆక్షేపణీయమన్నారు. 

9న అసెంబ్లీ ఇన్‌చార్జీలు
ఈ నెల 9న అసెంబ్లీ ఇన్‌ఛార్జీ్జలు, కన్వీనర్లతో (దాదాపు వెయ్యి మందితో) రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహిస్తున్నట్టు లక్ష్మణ్‌ వెల్లడించారు. జాతీయ పార్టీ ఇచ్చిన ఐదు కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక కమిటీ వేయమని అమిత్‌షా చెప్పారన్నారు. లోక్‌ సభ ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా అమిత్‌ షా మార్గదర్శనంలో అన్ని పార్టీల కన్నా ముందే సిద్ధమవుతున్నట్టు చెప్పారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో పార్లమెంట్‌ స్థానాలు గెలిచేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. నిజామాబాద్‌ క్లస్టర్‌ మీటింగ్‌ కి అమిత్‌ షా పాల్గొంటారని, ఈ సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. పెట్టుబడి వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న, సన్నకారు రైతుకు హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.1.60లక్షకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించడం పట్ల బీజేపీ తెలంగాణ శాఖ హర్షం వ్యక్తం చేసింది.

పార్టీ చేపట్టే కార్యక్రమాలు
►ఈ నెల 10న కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ నేతృత్వంలో ఐటీ అధిపతులు, నిపుణులతో హోటల్‌ ట్రైడెంట్‌లో సమావేశమవుతారు.
►13న మహబూబ్‌నగర్‌లో జరిగే మహబూబ్‌ నగర్, నాగర్‌కర్నూల్, చేవెళ్ల పార్లమెంట్‌ క్లస్టర్‌ సమావేశానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరవుతారు. 
►14న కరీంనగర్‌లో జరిగే భారత్‌ కీ మాన్‌ కీ బాత్‌ మోదీకీ సాత్‌ కార్యక్రమంలో రాంమాధవ్‌ పాల్గొంటారు.
► మేరా పరివార్‌ భాజపా పరివార్‌ పేరుతో ఈ నెల 12 నుంచి మార్చి 2 వరకు బూత్‌ స్థాయి లో 25 పార్టీ కార్యకర్తల ఇళ్లపై భాజపా జెండా ఎగురవేత.
►కమలజ్యోతి కార్యక్రమంలో లబ్ధి పొందిన 1.66 వేల మంది ఇళ్లలో జ్యోతి ప్రజ్వలన.
► మార్చి 2న మోదీ సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ విజయ్‌ సంకల్ప పేరుతో 119 అసెంబ్లీ నియోజకవర్గల్లో బైకు ర్యాలీలు. 

Advertisement
Advertisement