బ్యాలెట్‌ ద్వారానే ఎంపీ ఎన్నికలు జరపాలి | By the ballot MP elections should be held | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ ద్వారానే ఎంపీ ఎన్నికలు జరపాలి

Dec 17 2018 4:20 AM | Updated on Dec 17 2018 4:20 AM

By the ballot MP elections should be held - Sakshi

నల్లగొండ: వచ్చే పార్లమెంటు ఎన్నికలను బ్యాలెట్‌ ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం నల్లగొం డలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో పెద్దఎత్తున ట్యాంపరింగ్‌ జరిగిందని సోషల్‌ మీడియాతో పాటు బహిరంగం గా చర్చించుకుంటున్న విషయం తెలిసిందేనని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా జిల్లాలో 84 శాతం పోలింగ్‌ జరగడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. నల్లగొండ, తుంగతుర్తి తదితర ప్రాంతాల్లో పోలైన ఓట్లకు, ఈవీఎంలలో నమోదైన ఓట్లకు వేలల్లో తేడా ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ సర్వేలు నిర్వహించినా గట్టి పోటీ ఉంటుందని తేలిందని, కానీ టీఆర్‌ఎస్‌ వాళ్లంతా 50 నుంచి 70 వేల మెజార్టీతో గెలిచారంటే.. ట్యాంపరింగ్‌ జరి గినట్లు అనుమానం కలుగుతోందన్నారు.

వనపర్తి జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డిపై గెలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నిరంజన్‌రెడ్డికి ప్రజలతో సంబంధాలు లేవని, అలాంటిది ఆయన 50 వేల మెజార్టీతో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రజ ల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తేలిందని, ఆయన కూడా 50 వేల మెజార్టీతో గెలిచారంటే అనుమానం మరింత పెరుగుతోందన్నారు. కొండా సురేఖ, డీకే అరుణ తప్పక గెలుస్తారని సర్వేల్లో తేలితే ఫలితాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారని వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు పెట్టకపోవడానికి కారణమేంటని నిలదీశారు.

వీటిపై ఇప్పటికే పబ్లిక్‌ లిటిగేషన్‌ పిటిషన్‌ వేశామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో గోల్‌మాల్‌ చేసి గెలిచారనే అనుమానం తమకు కలుగుతోందని, అందుకే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి సహకారంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు.  ఈ సమావేశంలో కనగల్‌ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, బండమీది అంజయ్య, భిక్షంయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement