మోదీని అడిగితే.. ఆ 5 లక్షలు మిగిలేవి: ఒవైసీ

Asaduddin Owaisi mocks PM Modi over missing AN-32 - Sakshi

హైదరాబాద్‌: ఆలిండియా మజ్లిస్‌ ఇతేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన ఏఎన్‌-32 విమానం అదృశ్యమైన నేపథ్యంలో రాడర్ల విషయమై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఒవైసీ ఎద్దేవా చేశారు. రాడర్ల గురించి నరేంద్రమోదీకి చాలాబాగా తెలుసునని, ఏఎన్‌-32 విమానం ఎక్కడ అదృశ్యమైందో ఐఏఎఫ్‌ మోదీని అడిగితే సరిపోయేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఒవైసీ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘ మోదీ ఒక మంచి శాస్త్రవేత్త. రాడార్ల నుంచి తప్పించుకోవడానికి మేఘాలు సాయం చేస్తాయంటూ ఆయన శత్రుదేశం భూభాగంలోకి ఐఏఎఫ్‌ జెట్‌ విమానాల్ని పంపిస్తారు. కానీ, ఇటీవల జూన్‌ 3న 13 మందితో ప్రయాణిస్తున్న ఒక ఐఏఎఫ్‌ విమానం తప్పిపోయింది. ఈ విమానం ఆచూకీ చెప్పినవారికి రూ. 5 లక్షలు ఇస్తామని ఐఏఎఫ్‌ ప్రకటించింది. ఆ విమానం ఎక్కడ ఉందో మోదీని ఐఏఎఫ్‌ అడిగితే సరిపోయేది. రూ. 5 లక్షలు ఆదా అయ్యేవి’అంటూ ఒవైసీ ఎద్దేవా చేశారు.

తప్పిపోయిన ఐఏఎఫ్‌ ప్రయాణ విమానం ఏఎన్‌-32 ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో.. ఆ విమానం జాడ గురించి నమ్మకమైన సమాచారం ఇచ్చినవారికి రూ. 5 లక్షల నజరానా ఇస్తామని ఐఏఎఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఆర్డీ మథూర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top