ఆప్‌కు మరో సీనియర్‌ నేత రాజీనామా

AAP Senior Leader Ashish Khetan Resigns To Party - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత ఆశుతోష్‌ పార్టీని వీడి వారం గడవక ముందే మరో నేత ఆశిష్‌ ఖేతన్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆగస్ట్‌ 15నే ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు పంపినట్లు అశిష్‌ ఖేతన్‌ ప్రకటించారు. తాను లీగల్‌ ప్రాక్టీస్‌ చేసేందుకు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు క్రీయాశీల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు బుధవారం సోషల్‌ మీడియా పోస్ట్‌ చేశారు. ప్రభుత్వ సలహా మండలైన ఢిల్లీ డైలాగ్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ నుంచి గత ఏప్రీల్‌లోనే ఖేతన్‌ వైదొలిగిన విషయం తెలిసిందే.

జర్నలిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఖేతన్‌ ఆప్‌ ఏర్పడిన మొదటిలోనే పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి.. బీజేపీ అభ్యర్థి మీనాక్షీ లేఖీ చేతిలో ఓటమిపాలైయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారని, దానికి పార్టీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేసిందుకే ఆయన పార్టీకి రాజీనామా చేశారని ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ సీనియర్‌ నేతల రాజీనామాలు ఆప్‌ను కలవరపెడుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top