ఆ తల్లి ‘వెళ్లిపోయింది’

old woman died in godavarikhani - Sakshi

గత నెల 24న ప్లాస్టిక్‌ సంచిలో పెట్టి వదిలేసిన కొడుకు

అప్పటి నుంచి వృద్ధాశ్రమంలో..  

చనిపోయిందని చెప్పినా రాని కొడుకు  

కోల్‌సిటీ(రామగుండం): ఆ తల్లిని వదిలించు కోవాలని బతికున్నప్పుడే ప్లాస్టిక్‌ సంచిలో కట్టి నిర్జన ప్రదేశంలో వదిలేశాడా కొడుకు.. అప్పటి నుంచి వృద్ధాశ్రమంలో ఉన్న ఆ తల్లి శనివారం చనిపోయింది. తల్లి చనిపోయిందని సమాచా రామిచ్చిన స్పందించలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకొని దహన సంస్కారాలు చేయించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మినగర్‌కు చెందిన రాజోజుల వెంకటాద్రి తన తల్లి జగదాంబను గత నెల 24న ప్లాస్టిక్‌ సంచి లో పెట్టి నిర్జన ప్రదేశంలో వదిలేసిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ‘సాక్షి’గత నెల 25న ‘అమ్మను వదిలించుకోవాలని’.. శీర్షికన వెలుగులోకి తీసుకొచ్చింది.

నాడు పోలీసులు వచ్చి ఆ తల్లిని తిలక్‌నగర్‌లోని శ్రీధర్మశాస్త్ర వృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. తీవ్ర అనారోగ్యంతో తల్లడిల్లుతున్న ఆమె శనివారం మృతి చెందింది. విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులు కౌటం బాబు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయినా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్‌ సీఐ జి. కృష్ణ వచ్చి మృతురాలి కుమారుడు వెంకటాద్రితో పాటు మనవడిని ఆశ్రమానికి పిలిపించారు. వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించగా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నామని చెప్పారు. దీంతో సీఐ దహన సంస్కారాలకు ఆర్థిక సాయం చేశారు. దగ్గరుండి  శ్మశానవాటికకు పంపించారు.  

Read latest Peddapalli News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top