
మోత నుంచి విముక్తి?
‘పుస్తకాలు మోస్తున్న చిన్నారిని చూస్తుంటే, సిలువ మోసుకువెళుతున్న క్రీస్తు గుర్తుకొస్తాడు’ అంటాడు శేషేంద్ర.
‘పుస్తకాలు మోస్తున్న చిన్నారిని చూస్తుంటే, సిలువ మోసుకువెళుతున్న క్రీస్తు గుర్తుకొస్తాడు’ అంటాడు శేషేంద్ర. బడికి వెళ్లే పిల్లల పుస్తకాల మోత గురించి అంతా బాధ పడుతూనే ఉంటారు. విద్యావేత్తలు, మేధావులు దీనిని నిరోధించడానికి సిఫారసులు చేశారు. ఫలితం శూన్యం. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోబోతోంది. పుస్తకాల సంఖ్య తగ్గించ డం మాట ఎలా ఉన్నా, పిల్లలు ట్రాలీ బ్యాగులతో పాఠశాలలకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తామని హైకోర్టుకు విన్నవించింది.
బండెడు పుస్తకాల గురించి స్వాతి అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం మీద హైకోర్టు గట్టిగా స్పందించింది. ఆ మోతతో పదేళ్ల లోపు పిల్లల్లో 58 శాతం ఎముకల వ్యాధులకు గురౌతున్నారని ప్రభుత్వం నియమించిన కమిటీ కోర్టుకు ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. టైంటేబుల్ మార్చడం, నిత్యం పుస్తకాలన్నీ తీసుకెళ్లక్కరలేకుండా చర్యలు, స్కూల్లో లాకర్లు ఇలా చాలా అంశాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. శుభం.