నాటా వేదికగా హోదా ఆవశ్యకత  

Special Status Demand For Ap In NATA Held In Washington DC By YSRCP Leaders - Sakshi

నాటా మహాసభలకు వైఎస్సార్‌సీపీ నేతలు

అమెరికా రానున్న పలువురు ప్రముఖ నాయకులు

నాటా పొలిటికల్‌ఫోరం వేదికపై పార్టీ అభిప్రాయాలు

జులై 6,7,8 తేదీల్లో ఫిలడెల్ఫియా వేదికగా మహాసభలు

హోదా పోరు ప్రాముఖ్యతను ప్రస్తావించనున్ననేతలు

ఏపీలో ఫిరాయింపుల పర్వం, బాబు తీరును ఎండగట్టనున్న నేతలు

వాషింగ్టన్ డీసీ : నార్త్ ‌అమెరికన్ ‌తెలుగు అసొసియేషన్‌ మహా సభల్లో ఏపీకి ప్రత్యేక హోదా అవశ్యకతను చాటి చెపుతామని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇటీవల లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో పాటు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్‌రెడ్డి, నందమూరి లక్ష్మిపార్వతి నాటా సభల్లో పాల్గొనబోతున్నారు. నాటా సభలు జరగనున్న ఫిలడెల్ఫియాకు జులై 5 కల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బృందం రానుందని పార్టీ గవర్నింగ్ కౌన్సిల్ రమేష్ రెడ్డి వల్లూరు, పార్టీ యూఎస్ కన్వీనర్ రత్నాకర్ పండుగాయల తెలిపారు.
 
హోదా పోరులో ఏపీలో, ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలను ఎన్నారైల ముందుంచుతామని, నాలుగేళ్ల తర్వాత టీడీపీ, బీజేపీ ఎలా వెన్నుపోటు పొడిచారో వివరిస్తామని తెలిపారు. మహానేత వైఎస్సార్ వారసుడు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిగా చేసేవరకు అమెరికా కమిటీ ఆహర్నిశలు కష్టపడుతుందన్నారు. ప్రజలందరికీ మేలు చేసేలా వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను నాటా వేదికగా వేలాది మంది ఎన్నారైలకు చాటి చెపుతామన్నారు. జులై 8, 2018 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్ జయంతిని నాటా మహాసభల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్ సిపి యూఎస్ఏ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తుందని తెలిపారు.
 
పార్టీ నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలు నాటా పొలిటికల్‌ఫోరం సభల్లో పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, తమ పార్టీ నుంచి గెలిచిన 23 మందిని చంద్రబాబు ప్రలోభపెట్టి  ఏ విధంగా పార్టీ ఫిరాయించేలా చేశారో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు వివరిస్తారని తెలిపారు. అలాగే సమకాలీన అంశాలపై జరిగే రాజకీయ చర్చల్లో వైఎస్సార్‌సీపీ పొలిటికల్‌అడ్వైజరీ కమిటీ సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, గుంటూరు పార్లమెంట్‌ఇన్‌ఛార్జ్‌లావు కృష్ణ దేవరాయులు, పార్టీ శ్రీశైలం ఇంఛార్జ్‌శిల్పా చక్రపాణి రెడ్డి, పార్టీ ఎన్నారై కో ఆర్డినేటర్‌ హర్షవర్ధనరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పద్మజ, పార్టీ డాక్టర్స్ వింగ్‌అధ్యక్షులు శివభరత్‌రెడ్డి పాల్గొంటారని నాటా నిర్వాహకులు తెలిపారు. 

 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top