షాకింగ్‌: కరోనా పేషెంట్ల పక్కనే శవాలు | Video Shows Bodies Next To Covid 19 Patients In Mumbai Hospital | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: కరోనా పేషెంట్ల పక్కనే శవాలు

May 7 2020 2:07 PM | Updated on May 7 2020 4:39 PM

Video Shows Bodies Next To Covid 19 Patients In Mumbai Hospital - Sakshi

ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తి నేపథ్యంలో మహరాష్ట్రలోని ఓ ఆస్పత్రిలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. మృతదేహాల పక్కనే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. ముంబై మునిస్పల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న సియాన్‌ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే నితీశ్‌ రాణే ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘‘సియాన్‌ ఆస్పత్రిలో మృతదేహాల పక్కనే నిద్రిస్తున్న రోగులు!!! మరీ ఇంత ఘోరం. ఇదేం పాలన.. !! సిగ్గుపడాలి!’’అని ప్రభుత్వ తీరును విమర్శించారు.(గ్యాస్‌ లీక్‌ బాధితుల పట్ల శాపంగా మారిన కరోనా)

ఇక ఈ విషయంపై స్పందించిన ఆస్పత్రి డీన్‌ ప్రమోద్‌ ఇంగాలే మాట్లాడుతూ.. కోవిడ్‌-19తో మరణించిన వారి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు వారి బంధువులు ముందుకు రావడం లేదని తెలిపారు. అందుకే శవాలను ఆస్పత్రి బెడ్ల మీద ఉంచినట్లు పేర్కొన్నారు. మార్చరీలోని 15 స్లాట్లలోని.. 11 ఇది వరకే నిండిపోయాయని... ప్రస్తుతం కోవిడ్‌ మృతదేహాలను తరలించామని తెలిపారు. తాము ఈ ఏర్పాట్లు చేస్తున్నపుడే వీడియో తీసి ఉంటారని.. ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. మృతదేహాల నుంచి కరోనా వ్యాపించే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే 16,800 మందికి కరోనా సోకగా.. ఒక్క ముంబైలోనే 10,714 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 400 మంది కరోనాతో మరణించారు.(ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ)

Advertisement
 
Advertisement
Advertisement