
కార్చిచ్చుపై హెలికాప్టర్లతో నీళ్లు
ఉత్తరాఖండ్ అడవుల్లో రాజుకున్న కార్చిచ్చును మూడు, నాలుగు రోజుల్లో పూర్తిగా అదుపు చేస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అడవుల్లో రాజుకున్న కార్చిచ్చును మూడు, నాలుగు రోజుల్లో పూర్తిగా అదుపు చేస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దావానలంను పూర్తిగా ఆర్పివేసేందుకు 10 వేల మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పీఆర్డీ, అటవీ శాఖ సిబ్బందితో పాటు హోం గార్డులు శ్రమిస్తున్నారని చెప్పారు. పీఎంఓ, ఎన్డీఆర్ఎఫ్, ఐఏఎఫ్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించారు.
కాగా, స్థానిక అధికారులతో టచ్ లో ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఉత్తరాఖండ్ గవర్నర్ తో కూడా మాట్లాడానని చెప్పారు. మంటలు అదుపు చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తమ అధికారులు చర్చలు జరిపారని వెల్లడించారు. ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారులు కలిసికట్టుగా మంటలను అర్పేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఐదు జిల్లాల్లోని 2270 హెక్టార్లలో అడవులకు మంటలు వ్యాపించాయి. వీటిని అదుపు చేసేందుకు ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్లతో ప్రయత్నిస్తున్నాయి. మూడు ఎంఐ 17 హెలికాప్టర్లతో నైనిటాల్, పౌరీ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో వేల లీటర్ల నీళ్లు గుమ్మరించి మంటల్ని కొంతమేర అదుపులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం భీమ్టల్ సరస్సు, శ్రీనగర్ ఆన కట్ట నీటిని వినియోగించారు. ఆదివారం రోజంతా తీవ్రంగా శ్రమించి 75 శాతం మంటలను ఆర్పివేశామని అధికారులు తెలిపారు.