‘ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి షాక్‌’

Union Minister Ramdas Athawale Says BJP Will Win Fewer Seats - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఈసారి మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో తక్కువ సీట్లు వస్తాయని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. ఎస్సీ-బీఎస్పీ-ఆరెల్డీ కూటమితో యూపీలో బీజేపీకి 10 నుంచి 15 సీట్లు తగ్గుతాయని మహారాష్ట్ర దళిత నేత అంచనా వేశారు. 2014లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్‌తో కలిసి యూపీలోని 80 స్ధానాల్లో 73 స్ధానాలను గెలుచుకుందని, అయితే ఆ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ వేర్వేరుగా పోటీచేశాయని గుర్తుచేశారు.

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆ మూడు పార్టీలు జట్టు కట్టడంతో బీజేపీకి దక్కే స్ధానాలు తగ్గనున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో సైతం 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 5-6 సీట్లు తగ్గుతాయని ఆయన అంచనా వేశారు. కాగా ఈ రెండు రాష్ట్రాల్లో తగ్గే స్ధానాలను బీజేపీ పశ్చిమ బెంగాల్‌, ఒడిసా రాష్ట్రాల్లో భర్తీ చేస్తుందని, ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి గణనీయంగా లోక్‌సభ స్ధానాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అధికార పగ్గాలు చేపడతారని జోస్యం చెప్పారు. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విస్పష్ట మెజారిటీతో కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top