జేఈఈ మెయిన్‌లో మనోళ్ల సత్తా

Telugu Students Success In JEE Mains - Sakshi

టాప్‌–10లో ముగ్గురు రాష్ట్ర విద్యార్థులే

టాప్‌–24లో ఆరుగురు తెలుగు విద్యార్థులు

దేశవ్యాప్తంగా 24 మందికి 100%

మే 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

3 నుంచి దరఖాస్తుల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫలితాల్లో మళ్లీ తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఈ ఫలితాల్లో తెలంగాణకు చెందిన బట్టేపాటి కార్తికేయ జాతీయస్థాయిలో ఐదో ర్యాంకు కైవసం చేసుకున్నారు. తెలంగాణకే చెందిన అడెల్లి సాయికిరణ్‌ ఏడో ర్యాంకు, కె.విశ్వంత్‌ 8వ ర్యాంకు, ఇందుకూరి జయంత్‌ ఫణి సాయి 19వ ర్యాంకును సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండా రేణు 9వ ర్యాంకు, బొజ్జ చేతన్‌ రెడ్డి 21వ ర్యాంకును సాధించారు. బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన ఈ ఏడాది జనవరి 8 నుంచి 12 వరకు తొలి దఫా, ఆ తర్వాత ఏప్రిల్‌ 7 నుంచి 12వరకు జరిగిన రెండో దఫా జేఈఈ మెయిన్‌ పేపర్‌–1 పరీక్ష జరిగింది. జనవరిలో జరిగిన తొలిదఫా పరీక్ష ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే ప్రకటించగా, ఏప్రిల్‌లో జరిగిన రెండో దఫా పరీక్ష ఫలితాలను సోమవారం రాత్రి ప్రకటించింది.

ఢిల్లీకు చెందిన శుభాన్‌ శ్రీవాత్సవ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును కైవసం చేసుకోగా, కర్ణాటకకు చెందిన కెవిన్‌ మార్టిన్‌ రెండో ర్యాంకు, మధ్యప్రదేశ్‌కు చెందిన ధ్రువ్‌ అరోరా మూడో ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో ఎన్టీఏ ప్రకటించిన టాప్‌–24 ర్యాంకర్లలో తెలంగాణ నుంచి నలుగురు, ఏపీ నుంచి ఇద్దరికి చోటు లభించింది. జనవరిలో జరిగిన తొలి దఫా జేఈఈ మెయిన్‌ పరీక్షకు 8,74,469 మంది, ఏప్రిల్‌లో జరిగిన రెండో దఫా పరీక్షకు 8,81,096 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6,08,440 మంది విద్యార్థులు రెండు సార్లు పరీక్ష రాశారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకుని వీరికి ఎన్టీఏ ర్యాంకులను కేటాయించింది.

రెండు దఫాల్లో కలిపి మొత్తం 11,47,125 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌ పరీక్ష రాశారు. రెండో దఫాల్లో 608440 మంది పరీక్షలు రాయగా, అందులో 297932 మంది తమ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. కాగా, మొత్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన గురుమూర్తి, పద్మ దంపతుల కుమారుడు కె.విశ్వంత్‌ జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించారు. ఆయన తల్లిదండ్రులిద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన బట్టేపాటి కార్తికేయ హైదరాబాద్‌లో ఉండి చదువుకుంటున్నారు. సిద్దిపేటకు చెందిన దయానంద్, సునంద దంపతుల కుమారుడు అడెల్లి సాయికిరణ్‌ జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించారు.
 
మే 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష
జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో మెరిట్‌ ప్రకారం తొలి 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేయనున్నారు. ఈ అభ్యర్థులకు మే 27న అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

కంప్యూటర్‌ ఆధారితంగా పేపర్‌–1ను మే 27న ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్‌–2ను మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్ధులకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభం   మే 5 నుంచి

దరఖాస్తుకు చివరి తేదీ   మే 9
ఫీజు చెల్లింపునకు గడువు   మే 10
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌  మే 20నుంచి
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష   మే 27
ఆన్‌లైన్‌ కీ విడుదల   జూన్‌ 4
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు   జూన్‌ 14

 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top