జమ్ముకశ్మీర్లో సోమవారం భద్రతా బలగాల దాడుల్లో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల గురించి పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో సోమవారం భద్రతా బలగాల దాడుల్లో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల గురించి పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వారం రోజుల క్రితమే ఉగ్రవాదులిద్దరు.. విద్యార్థులమంటూ తప్పుడు సమాచారం ఇచ్చి శ్రీనగర్లోని సరాయ్ బాలా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వితంతువైన ఆ ఇంటి యజమానురాలు సైతం వారికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపించమని కోరకుండానే ఇంటిని అద్దెకు ఇచ్చినట్లు గుర్తించారు.
ఇద్దరు ఉగ్రవాదులు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తరపున పనిచేస్తున్నారు. ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు సరైన ఆధారాలు చూసుకొని ఇవ్వాలని, అలాగే ఈ విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని సెంట్రల్ కశ్మీర్ డీఐజీ గులామ్ హసన్ బట్ తెలిపారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సోమవారం శ్రీనగర్ లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పోలీసులు సైతం హతమైన విషయం తెలిసిందే.