రాజ్యసభలో రైల్వే బడ్జెట్ సమర్పణ సందర్భంగా మంగళవారం సభలో గందరగోళం తలెత్తింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ సమావేశమయ్యాక రైల్వేమంత్రి సదానందగౌడ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుండగా.
న్యూఢిల్లీ: రాజ్యసభలో రైల్వే బడ్జెట్ సమర్పణ సందర్భంగా మంగళవారం సభలో గందరగోళం తలెత్తింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ సమావేశమయ్యాక రైల్వేమంత్రి సదానందగౌడ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుండగా.. కాంగ్రెస్ నేత మధుసూదన్మిస్త్రీ అడ్డుపడ్డారు. చేతిలో ఒక దినపత్రికను పట్టుకుని ముందుకు వస్తూ రైల్వే బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించకముందే ఆ ప్రసంగం ఒక పత్రికలో ప్రచురితమైందని.. ఇది సభా హక్కుల ఉల్లంఘనేనని అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఆయనకు మద్దతుగా సీపీఎం సభ్యులు కూడా లేచినిల్చుని మాట్లాడారు. అయితే.. ఈ అంశంపై నోటీసు ఇవ్వవచ్చని, లేదంటే బడ్జెట్పై చర్చకు కేటాయించిన సమయంలో లేవనెత్తవచ్చని డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ సూచించారు. అయితే కాంగ్రెస్ సభ్యుడు మిస్త్రీ ఆందోళనను కొనసాగిస్తుండగా.. గందరగోళం మధ్యే రైల్వేమంత్రి బడ్జెట్ను సమర్పించారు. అనంతరం సభను డిప్యూటీ చైర్మన్ బుధవారానికి వాయిదావేశారు.