ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే. హేమాహేమీలు పోటీపడుతున్న ఆ స్థానంలో అతిరథమహారథులు ఓటు హక్కు వినియోగించుకోవడమే కారణం.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే. హేమాహేమీలు పోటీపడుతున్న ఆ స్థానంలో అతిరథమహారథులు ఓటు హక్కు వినియోగించుకోవడమే కారణం. అదే న్యూఢిల్లీ నియోజకవర్గం. ఈ స్థానం నుంచి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ సీనియర్ నేత విజేందర్ గుప్తా బరిలో ఉన్నారు. వీరి ముగ్గురి మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది.
ఇక ఈ నియోజకవర్గంలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సహా చాలా మంది ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. షీలాదీక్షిత్తో కలసి వచ్చి సోనియా ఓటేశారు. అదే సమయంలో సోనియా తోడికోడలు, బీజేపీ నేత మేనకా గాంధీ అక్కడకు వచ్చారు. వీరిద్దరూ ఎదురుపడినా పలకరించుకోలేదు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో సహా పలువురు కేంద్రమంత్రులు, సైన్యాధికారులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇదే నియోజకవర్గంలో ఓటేశారు.