
ఆ చర్యలు ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపుతాయన్న ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ : రైతులు, వలస కూలీల కోసం గురువారం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కల్పిస్తుందని, ఆహార భద్రత చేకూరడంతో పాటు రైతులు, వీధి వ్యాపారులకు రుణ లభ్యత మెరుగవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలు రైతులు, వలస కూలీలకు లబ్ధి చేకూర్చుతాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆర్థిక మంత్రి వెల్లడించిన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రగతిపథంలో నడిపిస్తాయని ప్రశంసించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజ్ రెండో దశలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతులకు భారీ రుణ వితరణ, వలస కూలీల సంక్షేమానికి పలు చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రానున్న రెండు నెలల్లో వలస కూలీలందరికీ రేషన్ కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేస్తామని మంత్రి ప్రకటించారు. వలస కూలీల సంక్షేమానికి రూ 10,000 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు. కనీస వేతన పెంపుతో పాటు పట్టణాల్లో వారి కోసం వసతి శిబిరాలను నిర్మిస్తామని పేర్కొన్నారు.