పాటిల్ నామినేషన్‌ను ఆమోదించిన ఈసీ | Patil's nomination was approved by EC | Sakshi
Sakshi News home page

పాటిల్ నామినేషన్‌ను ఆమోదించిన ఈసీ

Sep 29 2014 10:37 PM | Updated on Oct 19 2018 8:23 PM

ఎన్సీపీ అభ్యర్థిగా ఆర్‌ఆర్ పాటిల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని ఈసీ ఎట్టకేలకు ఆమోదించింది.

సాక్షి, ముంబై: ఎన్సీపీ అభ్యర్థిగా ఆర్‌ఆర్ పాటిల్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాన్ని ఈసీ ఎట్టకేలకు ఆమోదించింది. నామినేషన్ పత్రంలో లోపాలున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించిన ఎన్నికల సంఘం దానిని పక్కనబెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. నామినేషన్‌తోపాటు సమర్పించే ప్రతిజ్ఞాపత్రంలో అన్ని వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.

అయితే బేల్‌గావ్‌లో తనపై దాఖలైన కేసుల గురించి ఆర్ ఆర్ పాటిల్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు పాటిల్ పత్రాన్ని తొలుత పక్కనబెట్టారు. దీంతో నామినేషన్‌ను తిరస్కరించనున్నారా? లేక సదరు విషయాన్ని పత్రాల్లో పేర్కొనేందుకు మరో అవకాశం ఇస్తారా? అనే సందిగ్ధం ఏర్పడింది. అయితే ఎన్నికల సంఘం పాటిల్ నామినేషన్‌ను ఎట్టేకలకు ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది.

 అంకుశ్ కాకడే నామినేషన్ తిరస్కరణ...
 పుణేలోని కస్బాపేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరఫున పోటీ చేసేందుకు అంకుశ్ కాకడే దాఖలు చేసిన నామినేషన్ ఫారాన్ని ఎన్నికల సంఘం తిరస్కరించింది. నామినేషన్‌తోపాటు ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయకపోవడమే ఇందుకు కారణ మని ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు శనివారం నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

 దీంతో ఆయన ప్రమాణ పత్రాన్ని జోడించకుండానే నామినేషన్ దాఖలు చేశారు. ప్రమాణ పత్రం లేకపోవడాన్ని గమనించిన ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ ఫారాన్ని తిరస్కరించారు. అయితే ముందు జాగ్రత్తగా దీపక్ మాన్కర్‌తో కూడా ఎన్సీపీ నామినేషన్ వేయించింది. దీంతో అంకుశ్ కాకడే నామినేషన్ తిరస్కరించినప్పటికీ దీపక్ మాన్కర్ నామినేషన్‌ను స్వీకరించడంతో కస్బా ఎన్సీపీ అభ్యర్థిగా దీపక్ మాన్కర్ బరిలో ఉన్నారని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement