
నర్సులా వచ్చి పిల్లాడిని ఎత్తుకెళ్లింది
నర్సులా వచ్చిన ఓ మాయాలేడి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మూడురోజుల పసికందును దొంగలించింది.
మధుర: నర్సులా వచ్చిన ఓ మాయాలేడి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మూడురోజుల పసికందును దొంగలించింది. ఉత్తరప్రదేశ్ లోని మధుర ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. నవనీత్ నగర్ కు చెందిన నస్రీన్ జనవరి 29న మగబిడ్డను ప్రసవించింది. అయితే సోమవారం ఓ మహిళ నర్సులా పిల్లాడికి వాక్సిన్ వేయిస్తానని మాయామాటలు చెప్పి నస్రీన్ నుంచి పసికందును తీసుకుంది.
పిల్లాడిని తీసుకువెళ్లిన ఆమె ఎంతకు రాకపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డీ భాస్కర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వారు ఇరుగుపొరుగుతో కలిసి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో జిల్లా మెజిస్ట్రేట్ రాజేశ్ కుమార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. పిల్లాడి చోరీకి కారణమైన ముగ్గురు ఆస్పత్రి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.ఆస్పత్రి సూపరింటెండెంట్ పైనా చర్య తీసుకోవాల్సిందిగా మెజిస్ట్రేట్ సూచించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు పిల్లాడిని ఎత్తుకెళ్లిన మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.