పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్లో తల్లి(40), కూతురు(18) హత్యకు గురయ్యారు. వారి నివాసంలోనే ఈ హత్యలు జరిగాయి.
న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్లో తల్లి(40), కూతురు(18) హత్యకు గురయ్యారు. వారి నివాసంలోనే ఈ హత్యలు జరిగాయి. మృతదేహాలపై తీవ్ర గాయలను బట్టి వారిని చిత్రహింసలకు గురిచేసి హత్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలు బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే హతురాలి కుమారుడు జస్పాల్ తీవ్ర గాయాలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు ఇరుగుపొరుగువారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
జస్పాల్ బయటకు రావడంతో అనుమానంతో ఇరుగుపొరుగువారు ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లో తల్లి జస్పీర్, కుమార్తె ప్రభాజోట్లు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
గుర్తు తెలియని వ్యక్తులు వీరి ముగ్గురిపై కత్తులతో దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. అయితే వీరి ఇంట్లోకి ఎవరూ దౌర్జన్యంగా చొరబడిన దాఖలాలు లేవని తెలిపారు. నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సిసిటివి కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అలాగే ఇరుగుపొరుగువారిని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.