తమిళ పొన్నుకే మిస్‌ ఇండియా కిరీటం

Miss India Winner Anukreethy Vas - Sakshi

చెన్నై, తమిళనాడు : ‘మిస్‌ ఇండియా పోటీ’...దీనికున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉన్న ఈ పోటీల్లో ఈ ఏడాది కిరీటం ‘తమిళ పొన్ను’ అనుకృతి వాస్‌ను వరించింది. నిన్న రాత్రి ముంబై డోమ్‌లోని ‘ఎన్‌ఎస్‌సీఐ ఎస్‌వీపీ’ స్టేడియంలో జరిగిన ‘మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఫినాలే’లో 30 మంది ఫైనలిస్ట్‌లు పాల్గొనగా...తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల అనుకృతి వాస్‌ ఈ ఏడాది ‘మిస్‌ ఇండియా’గా ఎన్నికైంది.

గతేడాది ‘మిస్‌ వరల్డ్‌’గా ఎన్నికైన మానుషి చిల్లర్‌, అనుకృతికి కిరీటం ధరింపచేసింది. ఈ ప్రతిష్టాత్మక పోటీకి క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, కేఎల్‌ రాహుల్‌, ప్రఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్‌ గౌరవ్‌ గుప్తా, బాలీవుడ్‌ హీరోయిన్‌ మలైకా అరోరా, నటులు బాబీ డియోల్‌, కునాల్‌ కపూర్‌ వంటి ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ‘మాజీ మిస్‌ వరల్డ్‌’ స్టెఫానియే డెల్‌ వాలి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహర్‌, గాయకుడు ఆయుష్మాన్ ఖురానా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

కాగా ‘మిస్‌ ఇండియా - 2018’ పోటీలో మొదటి రన్నరప్‌గా ‘మిస్‌ ఇండియా హరియానా’కు చెందిన మీనాక్షి చౌదరీ నిలవగా...రెండో రన్నరప్‌గా ‘మిస్‌ ఇండియా’ ఆంధ్రపదేశ్‌కు చెందిన శ్రేయా రావ్‌ కామవరపు నిలిచింది. ప్రస్తుతం అనుకృతి వాస్‌ ‘మిస్‌ వరల్డ్‌ - 2018’ కోసం సిద్ధమవుతుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top