ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా

Melania Trump Visit Delhi Government School - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో ‘హ్యాపినెస్ క్లాసు’లను ఆమె పరిశీలించారు.

హైదరాబాద్‌ హౌజ్‌లో భారత ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో మెలానియా ట్రంప్‌ ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మెలానియాకు సాదర స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయ పద్దతిలో బొట్టు పెట్టి మంగళ హారతులతో మెలానియాను స్వాగతం పలికారు. చిన్నారుల స్వాగతానికి మెలానియా మురిసిపోయారు.

అనంతరం ఓ తరగతి గదిలోకి వెళ్లిన మెలానియా విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి ‘హ్యాపీనెస్‌ క్లాస్‌’ నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు మహిళా టీచర్లు మెలానియా వెంట ఉన్నారు. టీచర్లు అడిగిన ప్రశ్నలకు చిన్నారులు చక్కగా సమాధానం చెప్పారు. పాటలు, సంగీతం, ఆటలపై తమకు ఉన్న మక్కువను వివరించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు చేసిన నృత్యాలను మెలానియా తిలకించారు. 

అనంతరం మెలానియా మాట్లాడుతూ.. పాఠశాల విద్యావిధానం చాలా బాగుందని కితాబిచ్చారు. విద్యార్థులు తనపై చూపించిన ప్రేమ, అప్యాయత మరవలేనిదన్నారు. ఈ పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా మంచి నడవడికను నేర్పించడం బాగుందని మెలానియా పేర్కొన్నారు. 

(చదవండి : సైనిక వందనం స్వీకరించిన ట్రంప్‌)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top