వాజ్పేయి దైవ దూత ; మెహబూబా ముఫ్తీ
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ప్రజలకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దైవ దూత అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కొనియాడారు. సోమవారం ఢిల్లీలో జరిగిన వాజ్పేయి సంస్మరణ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్పేయితో కశ్మీర్ ప్రజలకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘వాజ్పేయి గొప్ప మానవతావాది. ఆయన కశ్మీర్ ప్రజల కోసం ఎంతగానో శ్రమించారు. కశ్మీర్ ప్రజలను నమ్మిన తొలి భారత నాయకుడు వాజ్పేయి. అలాగే అక్కడి ప్రజలు నమ్మిన నాయకుడు కూడా ఆయనే. అతి కొద్ది కాలంలోనే వాజ్పేయి కశ్మీర్ ప్రజల మన్నలను అందుకున్నారని ఆమె తెలిపారు. అక్కడ ఎన్నికల స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా జరపడం ద్వారా ఆయన ప్రజలు అభిమానాన్ని గెలుచుకున్నార’ని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎల్కే అద్వానీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురు రామ్దేవ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ఇతర విపక్ష నేతలతో పాటు అటల్ బిహారి వాజ్పేయి దత్తపుత్రిక నమితా భట్టాచార్య, మనుమరాలు నీహారిక తదితరులు పాల్గొన్నారు.