హేయమైన నేరాలైతే ఐపీసీ కిందే విచారణ | IPC neralaite prosecuted under the Damned | Sakshi
Sakshi News home page

హేయమైన నేరాలైతే ఐపీసీ కిందే విచారణ

Apr 23 2015 2:58 AM | Updated on Sep 3 2017 12:41 AM

హేయమైన నేరాలకు పాల్పడినట్లయితే 16 నుంచి 18 ఏళ్ల మధ్యనున్న బాలనేరస్తులను ఐపీసీ కిందే విచారిస్తారు.

న్యూఢిల్లీ: హేయమైన నేరాలకు పాల్పడినట్లయితే 16 నుంచి 18 ఏళ్ల మధ్యనున్న బాలనేరస్తులను ఐపీసీ కిందే విచారిస్తారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. జువెనైల్ చట్టానికి సవరణ చేయడానికి సమ్మతించింది. ఈ విషయాన్ని సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేబినెట్ భేటీ అనంతరం వెల్లడించారు. జువెనైల్ చట్టాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని... నిందితులు అత్యాచారం, హత్య, దోపిడీ, యాసిడ్ దాడి లాంటి హేయమైన నేరాలకు పాల్పడినపుడు శిక్షలు కఠినంగా ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో అనాథలు, శిశువిహార్‌లలోని పిల్లలను దత్తత తీసుకొనే ప్రక్రియను కూడా క్రమద్ధీకరించనున్నారు. పిల్లల సంరక్షణ రంగంలో ఉన్న సంస్థలన్నీ ఇకపై తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. ఈ మేరకు పలు సవరణలతో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును తేనున్నారు. అలాగే రూ. 5,150 కోట్లతో హరియాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో మూడు హైవేల నిర్మాణానికి కూడా  కేబినెట్ పచ్చజెండా ఊపింది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement