రికార్డు సృష్టిస్తున్న భారత్‌ | India Leads The World In Internet Shutdowns | Sakshi
Sakshi News home page

ఆందోళన జరిగితే ఇంటర్నెట్‌ కట్‌

Dec 13 2019 9:02 AM | Updated on Dec 13 2019 9:04 AM

India Leads The World In Internet Shutdowns - Sakshi

కశ్మీర్‌లో కల్లోలం.. ఇంటర్నెట్‌ కట్‌
ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తం.. సమాచారం షట్‌ డౌన్‌
సున్నిత అంశాలపై కీలక తీర్పు.. బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవ్‌
ఏ ఆందోళనకైనా, ఏ నిరసనకైనా అదే తంత్రం, అదే వ్యూహం
 

వాషింగ్టన్‌: నిన్నటికి నిన్న పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడిగాయి. దేశంలో ముస్లిం మైనార్టీలకు భద్రత ఉండదన్న ఆందోళనతో జనం రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అరుణాచల్‌ ప్రదేశ్, త్రిపురలో ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు. బిల్లుకి వ్యతిరేకంగా అస్సాంలో అంతకంతకూ ఆందోళనలు అధికమవడంతో పది జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్‌ సేవల్ని 24 గంటల సేపు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పుడే కాదు 2018లో భారత్‌లో పలు సందర్భాల్లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ అయ్యాయి. భద్రతా కారణాల రీత్యా సమాచార సంబంధాలను నిలిపివేయడం ఇవాళ, రేపు చాలా దేశాల్లో జరుగుతోంది. ఆందోళనల్ని అణచివేయాలంటే ప్రజలకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా చేయడమే మార్గమన్న ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి. భారత్‌తో పాటు చైనా, ఇరాన్, ఇథియోపియా దేశాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫ్రీడమ్‌ హౌస్‌ సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఇంటర్నెట్, డిజిటల్‌ మీడియా స్వేచ్ఛపై 65కు పైగా దేశాల్లో ఈ సంస్థ సమగ్ర అధ్యయనాన్నే నిర్వహించింది.

ఎప్పుడెప్పుడు ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు
మన దేశంలో మొదటిసారిగా 2010లో గణతంత్ర దినోత్సవాలకు ముందు కశ్మీర్‌ లోయలో ఇంటర్నెట్, ఫోన్‌ సేవల్ని నిలిపివేశారు.
2016లో హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బర్హన్‌ వనిని హతం చేసిన తర్వాత కశ్మీర్‌తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి.
కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్‌ 370 రద్దు చేయడానికి ముందు రోజు ఆగస్టు 4 నుంచి కశ్మీర్‌లో ఇంటర్నెట్, ఫోన్‌ సేవలు నిలిపివేశారు. ఇప్పుడు ఫోన్‌ సేవలు పునరుద్ధరించారు కానీ, 130 రోజులు గడుస్తున్నా ఇంటర్నెట్‌ ఇంకా వాడకంలోకి రాలేదు.  
2016లో పశ్చిమ బెంగాల్‌ డార్జిలింగ్‌లో ప్రత్యేక గోర్ఖాల్యాండ్‌ ఆందోళన సమయంలో 100 రోజులు ఇంటర్నెట్‌ షట్‌ డౌన్‌ చేశారు.
2015లో గుజరాత్‌లో విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు డిమాండ్‌ చేస్తూ పటీదార్‌ ఉద్యమం సందర్భంలోనూ ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి.  
గత నెలలో రామజన్మ భూమి తీర్పుకు ముందు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ బంద్‌ అయింది.

హోంశాఖకి అధికారాలు
భారత్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చిన్నపాటి అనిశ్చితి పరిస్థితులకి కూడా ఇంటర్నెట్‌ సేవల వినియెగాన్ని నిలిపివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేరళ హైకోర్టు ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండడం అన్నది ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది. రోజుల తరబడి ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేయడం చట్టవ్యతిరేకమని సెంటర్‌ ఫర్‌ ఇంటర్నెట్‌ సొసైటీ సభ్యుడు ప్రణేష్‌ ప్రకాశ్‌ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement