పీఎస్‌ఏ : నిర్భంధంలోకి మరో కీలక నేత

Former IAS Officer Shah Faesal Booked Under PSA - Sakshi

న్యూ ఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు చెందిన మరో కీలక నేత, మాజీ ఐఏఎస్‌ అధికారి షా ఫైజల్‌ ని ప్రజా భద్రతా చట్టం కింద నిర్భధించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా షా ఫైజల్‌ గళమెత్తిన సంగతి తెలిసిందే. కాగా, 2009లో సివిల్స్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించిన తొలి కశ్మీరీగా రికార్డు నెలకొల్పిన షా ఫైజల్‌.. గత జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. జమ్మూ కశ్మీర్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీని స్థాపించారు.

ఆర్టికల్‌ 370 రద్దు అనంతర పరిస్థితుల నేపథ్యంలో విదేశాలకు వెళ్తున్న ఫైజల్‌ను గతేడాది ఆగష్టు 14న ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకొని శ్రీనగర్‌కు తిప్పి పంపించారు. అనంతరం గృహ నిర్భంధంలో ఉంచారు. ఆర్నెళ్లపాటు నిర్భంధంలో ఉన్న ఫైజల్‌ను తాజాగా ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) కింద మరోసారి అదుపులోకి తీసుకున్నారు.

కాగా, పీఎస్‌ఏ కింద ఇప్పటికే జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు పలువురు కశ్మీర్‌ నేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు. పీఎస్‌ఏను అధికారికంగా జమ్మూ కశ్మీర్ ప్రజా భద్రతా చట్టం అని పిలుస్తారు. కలప అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఫారూక్ అబ్దుల్లా తండ్రి, మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పీఎస్‌ఏ కింద ఎలాంటి విచారణ లేకుండా.. రెండేళ్లపాటు నిర్బంధంలో ఉంచే వీలు ఉంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top