డేరాబాబా బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ | Derababa Parole Plea Rejected | Sakshi
Sakshi News home page

డేరాబాబా బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

Aug 9 2019 7:09 PM | Updated on Aug 9 2019 7:28 PM

Derababa Parole Plea Rejected - Sakshi

చండిఘర్‌ : ఇద్దరు మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చాసౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌రహీమ్‌సింగ్‌ (డేరాబాబా)పెట్టుకున్న బెయిల్‌ అభ్యర్థనను జైలు సూపరిండెంట్‌ తిరస్కరించారు. రోహతక్‌ జైలులో 20 సంవత్సరాల కారాగార శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా తన తల్లికి ఆరోగ్యం బాగాలేనందున మూడు వారాలు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా కోరారు. డేరాబాబా భార్య హర్జిత్‌కౌర్‌ ఇదే విషయమై పంజాబ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. డేరాబాబా తల్లి నసీబ్‌కౌర్‌(83) గుండె ఆపరేషన్‌ ఉన్నందున బెయిల్‌ ఇవ్వాలని అడిగారు. అయితే డేరాబాబా బయటకు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తొచ్చన్న అనుమానంతో బెయిల్‌ ఇవ్వాలా? వద్దా? అనేది జైలు అధికారుల విచక్షణకే హైకోర్టు వదిలేసింది. జైలు సూపరిండెంట్‌ డేరాబాబా ప్రవర్తనపై సంతృప్తి వ్యక్తం చేసి అతనే బెయిల్‌ ఇచ్చినా తమకేం అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో జైలు సూపరిండెంట్‌ డేరాబాబా తల్లి ఆరోగ్యంపై నివేదికను తెప్పించుకొని పరిశీలించి ఆయన పెట్టుకున్న బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరించారు.

కేసు పూర్వపరాలు..
డేరాబాబా ఆశ్రమంలో అనేక అక్రమాలతో పాటు మహిళలపై అత్యాచారాలను రామ్‌చందర్‌ ఛత్రపతి అనే జర్నలిస్టు తన కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆయనను డేరాబాబా 2002లో తన రివాల్వర్‌తో కాల్చి చంపారు. మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసులో డేరాబాబా దోషిగా తేలడంతో హర్యానాలోని పంచకుల సెషన్స్‌ కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్షను 2017లో విధించింది. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో 32 మంది మరణించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement