దళిత బాలికపై గ్యాంగ్ రేప్ | Dalit girl gang-rape | Sakshi
Sakshi News home page

దళిత బాలికపై గ్యాంగ్ రేప్

Jul 22 2014 2:32 AM | Updated on Sep 2 2017 10:39 AM

ఉత్తరప్రదేశ్‌లో ఓ దళిత బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ నేరం ఆలస్యంగా వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం
 
మధుర: ఉత్తరప్రదేశ్‌లో ఓ దళిత బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ నేరం ఆలస్యంగా వెలుగు చూసింది. మధుర జిల్లా పింగ్రి గ్రామంలో శనివారం రాత్రి ఓ ఆలయంలో జరిగిన ఉత్సవానికి బాలిక వెళ్లింది. అదే రాత్రి బహిర్భూమికి వెళ్లగా ఆమెను ఆరుగురు యువకులు అపహరించి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వెళ్లారు. ఆ భయంతో ఇంటికి వెళ్లిన బాలిక మర్నాడు కుటుంబ సభ్యులకు జరిగిన ఘోరాన్ని వివరించింది. దానిపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, అత్యాచారానికి పాల్పడిన నిందితులు మనోజ్, మహేష్, గుడ్డు, సన్నో, రామ్‌వీర్, శేఖర్‌గా గుర్తించినట్లు పోలీసు అధికారి నితిన్ తివారీ సోమవారం మీడియాకు తెలిపారు. మహేశ్ తప్ప మిగతా అందరినీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

బెంగళూరు పోలీస్ కమిషనర్ బదిలీ

బెంగళూరు: బెంగళూరులోని ఓ పాఠశాలలో ఆరేళ్ల బాలికపై అత్యాచార ఘటనపై నిరసనలతో కర్ణాటక ప్రభుత్వంలో చలనం వచ్చింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌పై ప్రభుత్వం సోమవారం బదిలీ వేటు వేసింది. ప్రధాన నిందితుడైన స్కేటింగ్ శిక్షకుడు ముస్తఫా(31)పై గూండా చట్టం ప్రయోగించాలని నిర్ణయించింది. ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందన్న విమర్శల నేపథ్యంలో తాజా నిర్ణయాలు వెలువడ్డాయి. మరోవైపు ఈ ఘటనపై నిరసనలు సోమవారం హింసాత్మక రూపం దాల్చాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement