కోవిడ్‌ కట్టడికి కర్ణాటక కీలక నిర్ణయం

Covid cluster areas to be sealed in Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉందనుకున్న రాజధాని నగరం బెంగళూరులో వైరస్‌ పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సోమవారం ఉదయం అత్యున్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప కీలక సమావేశం నిర్వహించారు. ఒక్క ఆదివారం రోజునే రాష్ట్ర వ్యాప్తంగా 1200కు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 64 మంది వైరస్‌ బాధితులు మృతి చెందిన నేపథ్యంలో అధికారులు, వైద్యులతో సమీక్ష జరిపారు. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదైన కోవిడ్‌ కేంద్రాలను గుర్తించి వాటి సరిహద్దులను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. (మూడురెట్లు పెరిగిన టెస్టింగ్‌ సామర్థ్యం)

అలాగే లక్షణాలు కనిపించిన ప్రతీ ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు.  కరోనా పరీక్షల సామర్థ్యం కూడా పెంచాలని అధికారులకు సీఎం సూచించారు. మరోవైపు ఒక్క బెంగళూరు నగరంలోనే 298 కంటైన్‌మెంట్‌ జోన్లను తాజాగా గుర్తించామని స్థానిక అధికారులు మీడియాకు వెల్లడించారు.  ఒకవేళ కరోనా బాధితులు పెరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా 518 ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించామని తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇ‍ప్పటి వరకు 9,150 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు 137 మంది మృతి చెందారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top