ఆర్మీ క్యాంపులో ఘర్షణ


♦ గుండెనొప్పితో జవాను మృతి.. కెప్టెన్‌పై సహచర జవాన్ల దాడి

♦ తిరుగుబాటు కాదన్న ఆర్మీ

 

 ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఓ మిలటరీ క్యాంపులో ఆదివారం ఘర్షణ చెలరేగింది. సహచరుడు గుండెనొప్పితో మృతి చెందడంతో ఆగ్రహించిన కొందరు జవాన్లు.. కెప్టెన్‌పై దాడిచేశారని.. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉందని ఆర్మీ తెలిపింది.  ఈటానగర్‌కు దగ్గర్లోని క్యాంపులో రోజూలాగే రూట్ మార్చ్ మొదలైంది. ఓ జవాను తనకు ఛాతీలో నొప్పిగా ఉందని కెప్టెన్‌కు తెలిపారు. పరీక్షించిన యూనిట్ వైద్యాధికారి.. సదరు జవాను శిక్షణకు ఫిట్‌గా ఉన్నాడని చెప్పడంతో తప్పనిసరి స్థితుల్లో మార్చ్‌లో పాల్గొనాల్సి వచ్చింది.



మార్చ్ మొదలవగానే ఆ జవాన్ గుండెనొప్పితో కుప్పకూలటంతో వైద్యాధికారి.. ఆయన చనిపోయినట్లుగా నిర్ధారించారు. దీంతో కోపోద్రిక్తులైన నలుగురైదుగురు అక్కడే ఉన్న కెప్టెన్‌పై దాడిచేసి గాయపరిచారు. వెంటనే ఇతర జవాన్లు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ విషయం బయటకు పొక్కటంతో.. సైన్యంలో తిరుగుబాటు మొదలైందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆర్మీ ఉన్నతాధికారులు ఖండించారు. ఈ ఘటనలో విచారణకు ఆదేశించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top