500కు 499 మార్కులు.. మళ్లీ వాళ్లే టాప్‌! | CBSE 2019 Results Are Out UP Two Girls Got Top Rank | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఫలితాలు వెల్లడి

May 2 2019 2:21 PM | Updated on May 2 2019 2:23 PM

CBSE 2019 Results Are Out UP Two Girls Got Top Rank - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) పన్నెండో తరగతి ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఏడాది 84.3 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్తీర్ణత శాతంలో విద్యార్థినులే ముందున్నారు. అదేవిధంగా మొదటి రెండు స్థానాల్లోనూ నిలిచి మరోసారి సత్తా చాటారు. 500 గానూ 499 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థినులు హన్సికా శుక్లా, కరీష్మా అరోరా టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. వీరిద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారే కావడం విశేషం. ఇక 498 మార్కులతో ముగ్గురు విద్యార్థినులు గౌరంగీ చావ్లా, ఐశ్వర్య(రిషికేశ్‌), భవ్య(హర్యానా) సంయుక్తంగా రెండో స్థానం సంపాదించారు.

కాగా సీబీఎస్‌ఈ టాపర్‌గా నిలిచిన హన్సికకు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు.. ‘ సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఫలితాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన హన్సికా శుక్లాకు అభినందనలు’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఇక గతేడాది కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మేఘన శ్రీవాస్తవ 500 మార్కులకు గానూ 499 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలవగా, అదే రాష్ట్రానికి చెందిన మరో విద్యార్థిని అనౌష్క చంద్ర 498 మార్కులతో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement