1.9 కోట్లమందిని భారత పౌరులుగా గుర్తించారు! | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 1 2018 11:25 AM

Assam recognises 1.9 crore legal citizens in first draft - Sakshi

గువాహటి: రాష్ట్రంలోని 1.9 కోట్లమందిని చట్టబద్ధమైన పౌరులుగా గుర్తిస్తూ అసోం ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి జాతీయ పౌర నమోదు (ఎన్‌ఆర్సీ) తొలి ముసాయిదాను ప్రచురించింది. మొత్తం 3.29 కోట్లమంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1.9 కోట్లమందిని చట్టబద్ధమైన భారత పౌరులుగా గుర్తించింది. మిగతా వారు దరఖాస్తులు వివిధ ధ్రువీకరణ దశల్లో ఉన్నాయని భారత రిజిస్టర్‌ జనరల్‌ శైలేష్‌ తెలిపారు.

అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ కూడా ఈ విషయమై స్పందించారు. ఈ జాబితాలో పేరులేని ‘నిజమైన పౌరులు’ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తుది జాబితాలో వారి పేర్లు తప్పకుండా ఉంటాయని సీఎం సోనోవాల్‌ అన్నారు. ఇది ఈ జాబితాను రూపొందించడం చారిత్మాతక సందర్భమని ఆయన అభివర్ణించారు. దేశ విభజన అనంతర వలసల నేపథ్యంలో 1951లో జాతీయ పౌర నమోదు జాబితాను తొలిసారి చేపట్టిన రాష్ట్రంగా అసోం నిలిచిందని, ఇప్పుడు కూడా అలాంటి జాబితా రూపకల్పనను చేపట్టిన ఏకైక రాష్ట్రం అసో అని అన్నారు. ‘ఈ-సేవ’ కేంద్రాలు, ఎస్సెమ్మెస్‌ సర్వీస్‌ ద్వారా తమ పేరు జాబితాలో ఉందో లేదో ప్రజలు తెలుసుకోవచ్చు. పొరుగు దేశాల నుంచి వలసల నేపథ్యంలో అసోంలోని నిజమైన స్థానిక పౌరుల గుర్తింపు కోసం జాతీయ పౌర నమోదును చేపట్టాలన్న డిమాండ్‌పై 2005 నుంచి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం దీనిని చేపట్టింది.

Advertisement
Advertisement