పైలట్ వెన్నపోటుదారుడు : గహ్లోత్
తిరుగుబాటు నేతపై విమర్శల దాడి
జైపూర్ : రాజస్ధాన్లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్పై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విమర్శల దాడి పెంచారు. పైలట్ కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచారని గహ్లోత్ ఆరోపించారు. ఎవరన్ని కుట్రలు పన్నినా సత్యమే గెలుస్తుందని, తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. సచిన్ పైలట్ పనికిరాడని తమకు తెలిసినా ఏడేళ్లుగా రాష్ట్ర పీసీసీ చీఫ్ను మార్చలేదని గహ్లోత్ పేర్కొన్నారు. మరోవైపు సచిన్ పైలట్ సహా 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై కోర్టులో విచారణ కొనసాగుతోంది.
హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక సచిన్ పైలట్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తమ వర్గంలోకి వస్తే రూ. 35 కోట్లు ఇస్తామంటూ తిరుగుబాటు నేత ఆఫర్ ఇచ్చారని ఆయన బాంబు పేల్చారు. అశోక్ గెహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరించాలని కోరినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా గిరిరాజ్ సింగ్ ఆరోపణలపై పైలట్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన గిరిరాజ్పై పైలట్ పరువునష్టం దావా వేస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మనేసర్ రిసార్ట్స్లో ఉన్న తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని పైలట్ ఆరోపించారు. చదవండి : బీజేపీలో చేరి పీఎం అవుతారా!