50 ఏళ్లలో 8.5 సెం.మీ. పెరిగిన సముద్రమట్టం
న్యూఢిల్లీ: 50 ఏళ్లలో భారత తీరం వెంబడి సముద్రమట్టం 8.5 సెంటీమీటర్లు పెరిగిందని పర్యావరణ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో రాజ్యసభలో చెప్పారు. గ్లోబల్ వార్మింగ్తో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా అనేక నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదు దశాబ్దాల్లో భారత తీరం వెంబడి సముద్ర మట్టం సగటున సంవత్సరానికి సుమారు 1.70 మిల్లీమీటర్లు పెరిగిందన్నారు. శాటిలైట్ అల్టిమెట్రి, మోడల్ సిమ్యులేషన్ ప్రకారం 2003–13 మధ్య ఉత్తర హిందూ మహా సముద్రం వైవిధ్యతను ప్రదర్శించిందని, సంవత్సరానికి 6.1 మి.మీ మేర పెరిగిందని రాతపూర్వకంగా బదులిచ్చారు. సునామీ, తుఫాను ప్రభావం, తీర ప్రాంతంలో వరదలు కూడా సముద్రమట్టం పెరుగుదలకు కారణమవుతాయని తెలిపారు.