ఆన్‌లైన్‌లో బిగిల్‌

Vijay Bigil Movie Leaked Online - Sakshi

చెన్నై: బిగిల్‌ చిత్రాన్ని పైరసీ వదల్లేదు. విడుదలైన కొన్ని గంటల్లోనే అనధికారికంగా ఆన్‌లైన్‌లో పూర్తి సినిమా హల్‌చల్‌ చేసింది. ఇది చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం బిగిల్‌. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్‌ సంస్థ నిర్మించింది. బిగిల్‌ చిత్రం భారీ అంచనాల మధ్య దీపావళి సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. అయితే విడుదలకు ముందు నుంచే మొదలైన బిగిల్‌ చిత్ర రచ్చ ఆ తరువాత కూడా కొనసాగుతోంది. ఈ చిత్రంతో పాటు కార్తీ హీరోగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో డ్రీమ్‌వారియర్, వివేకానందా స్టూడియోస్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఖైదీ చిత్రం ఒకే సారి విడుదలయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలకు పైరసీ దెబ్బ తగిలింది. బిగిల్‌ చిత్రం విడుదలైన కొన్ని గంటలకే అనధికారికంగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయితే కొంచెం ఆలస్యంగా అంటే శుక్రవారం రాత్రి ఖైదీ చిత్రం ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేసింది. కాగా ఈ రెండు చిత్రాలను అనధికారకంగా, అక్రమంగా ఆన్‌లైన్‌లో ప్రచారం చేయరాదని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా కోర్టు ఆదేశాలను భేఖాతరు చేసి తమిళ్‌రాకర్స్‌ అనే వెబ్‌సైట్‌ పైరసీకి పాల్పడడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పైరసీని  అరికట్టడం సాధ్యం కాదా అన్న చర్చ జరుగుతోంది. 

విజయ్‌ అభిమానులు అరెస్ట్‌.. 
కాగా బిగిల్‌ చిత్ర విడుదల సమయంలో నటుడు విజయ్‌ అభిమానులు చేసిన వీరంగం పలు విమర్శలకు దారి తీసింది. అంతే కాదు అలాంటి పలువురు విజయ్‌ అభిమానులు ఇప్పుడు జైలు ఊసలు లెక్క పెడుతున్నారు. ఈ వివరాలు చూస్తే కృష్ణగిరిలోని ఒక థియేటర్‌ వద్ద నటుడు విజయ్‌ అభిమానులు బీభత్సం సృష్టించారు. దీపావళి సందర్భంగా విడుదలయ్యే చిత్రాలకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం చివరికి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లయాజమాన్యం విజ్ఞప్తి మేరకు మొదటి రోజు మాత్రం అనుమతినిచ్చింది. కాగా కృష్ణగిరిలోని థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శనకు ఆలస్యం కావడంతో విజయ్‌ అభిమానులు ఆ ప్రాంతంలో నానా బీభత్సాన్ని సృష్టించారు. రోడ్డుకిరుపక్కల ఉన్న వ్యాపార దుకాణాలపై దాడి చేసి నానా యాగం చేశారు. ఆస్తులను «ధ్వంసం చేశారు. సగటు ప్రజలను భ్రయభాంత్రులకు గురి చేశారు. దీంతో రక్షకబటులు రంగంలోకి దిగాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అంతే ఆ ప్రాంత పోలీసులు వచ్చి చిన్న పాటి లారీచార్జ్‌ చేసి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే ఈ రచ్చకు కారణం అయిన 30 మంది విజయ్‌ అభిమానులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నాన్‌బెయిలబుల్‌ కేసులను నమోదు చేసి జైలుకు తరలించారు. ఇటీవల నటుడు విజయ్‌ బిగిల్‌ ఆడియో ఆవిష్కరణ వేదికపై తన అభిమానులను ఏమన్నా సహించేది లేదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కృష్ణగిరి సంఘటనతో ఇలాంటి అభిమానులనా నటుడు విజయ్‌ వెనకేసుకొస్తున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కస్తూరి ఫైర్‌.. 
కాగా సమాజంలో జరిగే సంఘటనలపై, ముఖ్యంగా సినీ, రాజకీయాలకు సంబంధించిన విషయాలపై వెంటనే స్పందించే నటి కస్తూరి విజయ్‌ అభిమానుల చర్యలపైనా తీవ్రంగానే స్పందించారు. ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంటూ నటుడు విజయ్‌ నటించిన బిగిల్‌ చిత్రం ఎన్ని రికార్డులు సాధించినా, ఇప్పుడు ఆయన అభిమానులు సృష్టించిన అరాచకం ఎప్పుడూ గుర్తుకొస్తుందన్నారు. కృష్ణగిరిలోని సంఘటన  వ్యతిరేక వర్గం చర్యలని సరిపెట్టుకున్నా, నిజమేమిటో మన మనసుకు తెలుసన్నారు. నిజమైన అభిమానులు తాను అభిమానించే నటులను ఇంతగా చెడ్డ పేరు తెచ్చే చర్యలకు పాల్పడరన్నారు. ఇలాంటి వారా తమిళనాడు భావిపౌరులు అని నటి కస్తూరి తూర్పారపట్టారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top