నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా! - Sakshi


– నాగార్జున



‘నాన్న (అక్కినేని నాగేశ్వరరావు)గారు లేరు అనడం తప్పు. ఆయన ఎప్పుడూ మాతోనే ఉన్నారు. ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటారు’’ అన్నారు నాగార్జున. ఓంకార్‌ దర్శకత్వంలో నాగార్జున, సమంత, శీరత్‌ కపూర్‌ ముఖ్య తారలుగా పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్, ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మించిన చిత్రం ‘రాజుగారి గది 2’. ఏయన్నార్‌ జయంతి సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు.



నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారి పుట్టిన రోజు సెప్టెంబర్‌ 20న మా ఫ్యామిలీ అంతా ఆయన ఇంట్లోనే బ్రేక్‌పాస్ట్‌కి తప్పనిసరిగా కలుస్తాం. ఇప్పుడు అక్కణ్ణుంచే వస్తున్నాను. అక్కడికి వెళిన వెంటనే ఒక చిరునవ్వు, తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. ‘రాజుగారి గది 2’కి నా అనుభవంతో చిన్న ఇన్‌పుట్స్‌ ఇచ్చాను. ఫస్ట్‌ ఓంకార్‌ చేసిన ట్రైలర్‌ నచ్చలేదన్నా. ఒక రోజు టైమ్‌ తీసుకుని, మంచి ట్రైలర్‌ కట్‌ చేశారు. సినిమాలో నేను మెంటలిస్ట్‌ క్యారెక్టర్‌ చేశా. సమంత, శీరత్‌లలో ఎవరు దెయ్యం అనేది ఆసక్తికరం.



పీవీపీగారు ఖర్చకు వెనకాడకుండా సినిమాను పూర్తి చేశారు. తమన్‌ మ్యూజిక్‌ హైలైట్‌. అక్టోబర్‌ 13 కోసం వెయిట్‌ చేస్తున్నా’’ అన్నారు. ‘‘ఏయన్నార్‌గారి పుట్టిన రోజునాడు మా సినిమా ట్రైలర్‌ విడుదల కావడం హ్యాపీ. అవుట్‌పుట్‌ బాగా రావడంలో నాగార్జునగారు సపోర్ట్‌ చేశారు’’ అన్నారు నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి. ‘‘కథ విన్న 5 నిమిషాల్లోనే నాగార్జునగారు ఒప్పుకున్నారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని అక్టోబర్‌ 13న నిజం చేసుకుంటానని అనుకుంటున్నాను’’ అన్నారు ఓంకార్‌. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్‌ జగన్‌తోపాటు చిత్రబృందం పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top